Bhasyakarula Utsavam grandly held in Tirumala

bhasyakarula 1

తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న భాష్యకారుల ఉత్సవంలో భాగంగా గురువారం వెళ్లై సాత్తుపడి(ధవళ వస్త్రం) ఉత్సవం ఘనంగా జరిగింది. ఏప్రిల్‌ 22న భాష్యకార్ల ఉత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే. ఇందులో 6వ రోజు, చివరిరోజు జరిగే ఉత్సవాలు ప్రముఖమైనవి.

6వ రోజు జరిగే ఉత్సవాన్ని ‘వెళ్లై సాత్తుపడి’ అని వ్యవహరిస్తారు. శ్రీ రామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని చివరి రోజైన మే 1న భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

గురువారం ఉదయం భగవద్‌ రామానుజాచార్యులవారిని తెల్లని వస్త్రాలతో విశేషంగా అలంకరించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. జీయర్‌స్వాములు, ఏకాంగులు తదితరులు దివ్యప్రబంధ గోష్ఠి నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

సాధారణంగా భాష్యకారుల సన్నిధిలో భగవద్‌ రామానుజాచార్యులకు కాషాయ వస్త్రం అలంకరిస్తారు. తెల్లని వస్త్రం అలంకరించడానికి ప్రత్యేక కారణం ఉంది. శ్రీవైష్ణవాచార్యులైన  శ్రీ రామానుజులవారు ఈ రోజున శ్రీరంగం నుంచి తెల్లని వస్త్రాలు ధరించి కర్ణాటకలోని మేల్కొటెకి వెళ్లారు. ఇందుకు శ్రీ రామానుజులవారి అనుయాయులైన శ్రీ కూరత్తాళ్వార్‌ సహకారం అందించారు. ఆ తరువాత మేల్కొటెలో 14 సంవత్సరాల పాటు శ్రీ రామానుజులు ఆధ్యాత్మిక జీవనం గడిపారు. ఈ ఘట్టానికి గుర్తుగా భాష్యకార్ల ఉత్సవంలో ఆరో రోజు తెల్లని వస్త్రాన్ని అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. అన్ని వైష్ణవాలయాల్లో శ్రీరామానుజులవారికి ఈఉత్సవం నిర్వహిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published.

− six = one